East Godavari District: ప్రియుడి కోసం బరితెగించిన 'కన్నింగ్' ఇల్లాలు... 17 రోజుల తరువాత హత్య గుట్టురట్టు!

  • గత నెల 26న తూర్పు గోదావరి జిల్లాలో హత్య
  • ప్రియుడి కోసం భర్తను చంపిన ప్రియదర్శిని
  • పోస్టుమార్టం రిపోర్టు తరువాత అసలు నిజం వెలుగులోకి

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన రాంబాబు అనే వ్యక్తి కేసులో అసలు నిజాన్ని పోలీసులు వెలికితీశారు. ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు చేసిన ఘాతుకమే ఇదని తేల్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తోటవారి పల్లెకు చెందిన రాంబాబు, ప్రియదర్శిని 17 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా, వారికి ఓ బాబు, పాప ఉన్నారు. ఇటీవల ప్రియదర్శినికి ఫేస్ బుక్ లో శివసాయి కిశోర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఇంట్లో తగాదాలు వస్తుండటంతో భర్తను వదిలి, ప్రియుడితో చెన్నైకి పారిపోయిన ప్రియదర్శినిని, పోలీసుల సాయంతో వెనక్కు తెచ్చుకున్నాడు రాంబాబు. ఆపై కొంతకాలం తరువాత, ఫేస్ బుక్ అందిస్తున్న మెసెంజర్ యాప్ ద్వారా కిశోర్ తో చర్చించిన ప్రియదర్శిని, రాంబాబును హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. గత నెల 26న కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి ఇవ్వగా, రాంబాబు మత్తులోకి జారుకున్నాడు. ఆ సమయంలో అతని ముఖానికి దిండును గట్టిగా అదిమి ప్రియదర్శిని, శివసాయి కిశోర్ కలసి హత్య చేశారు.

ఆపై హత్యను తాను చేశానని చెప్పి లొంగిపోతానని, జైలుకు వెళ్లిన తరువాత బెయిల్ పై విడిపించాలని చెబుతూ కిశోర్ కు రూ. 2 లక్షలిచ్చి పంపించివేసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత, పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో ప్రేమాయణం మొదలు, హత్యకు ఎలా ప్లాన్ చేశానన్న విషయం వరకూ మొత్తం పూస గుచ్చినట్టు చెప్పిందా కన్నింగ్ ఇల్లాలు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.

More Telugu News