CBSE Topper: హర్యానాలో దారుణం... సీబీఎస్ఈ టాపర్ పై గ్యాంగ్ రేప్!

  • ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న యువతి
  • కోచింగ్ సెంటర్ నుంచి వస్తున్న వేళ కిడ్నాప్
  • అత్యాచారం అనంతరం బస్టాండ్ సమీపంలో వదిలి పరారీ

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో టాపర్ గా నిలిచి, అవార్డును అందుకున్న ఓ చదువుల తల్లిని కామాంధులు చిదిమేశారు. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, కోచింగ్ సెంటరుకు వెళ్లి వస్తున్న వేళ, రెవారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

 ఓ కారులో వచ్చిన ముగ్గురు నిందితులు, ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం స్పృహ తప్పిన యువతిని, బస్టాండ్ సమీపంలో పారేసి వెళ్లిపోయారు. వీరంతా తమ గ్రామానికి చెందిన వారేనని గుర్తించిన యువతి, తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీసు స్టేషన్ లో కాకుండా, మరో ప్రాంత స్టేషన్ లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ ను జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఆపై దీన్ని సదరు నేరం జరిగిన ప్రాంత పీఎస్ కు బదిలీ చేస్తారు.

More Telugu News