Operation Garuda: జగన్ కేసులకు సహకరిస్తూ, చంద్రబాబుపై పగ తీర్చుకుంటున్న బీజేపీ: బుద్ధా వెంకన్న నిప్పులు

  • ఆపరేషన్ గరుడలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు
  • జగన్ కేసులు తేల్చకుండా కక్షసాధింపు ధోరణి
  • మోదీలోని నియంత బయటకు వచ్చారన్న బుద్ధా వెంకన్న

బీజేపీ ప్రారంభించిన ఆపరేషన్ గరుడలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నో కేసుల్లో చిక్కుకుని, తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడి, ప్రతి వారం కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్ కేసుల విషయంలో బీజేపీ తనవంతు సహకారాన్ని అందిస్తోందని ఆరోపించిన ఆయన, చంద్రబాబుపై మాత్రం బీజేపీ పగ తీర్చుకుంటోందని నిప్పులు చెరిగారు.

జగన్ కేసుల విచారణ పూర్తి కాకుండా చూస్తున్న బీజేపీ, తమ అధినేతపై పాత కేసులను తిరగదోడి ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. న్యాయస్థానాలే తప్పెవరిదో తేలుస్తాయని అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా మరుగున పడివున్న కేసును, ఎన్నికల వేళ బయటకు తీసి వారెంట్లు జారీ చేయడం ఏంటని వెంకన్న ప్రశ్నించారు. ఏళ్ల తరబడి సాగుతున్న జగన్ కేసులను తేల్చకుండా, చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణిని బీజేపీ ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ఈ ఘటనతో తెలిసిపోయిందని, ఆయనలోని నియంత కూడా బయటపడ్డాడని విమర్శించారు.

More Telugu News