Karnataka: ప్రేమ జంటపై ఆగంతుకుల దాడి.. ప్రియుడి చేతిని నరికి తీసుకెళ్లిన దుండగులు!

  • కర్ణాటకలోని బన్నేరుఘట్టలో దారుణం
  • ప్రియుడి వద్దకు వచ్చేసిన వివాహిత
  • ఆలయం వద్ద దాడిచేసిన దుండగులు

తల్లిదండ్రులు ఇష్టంలేని వివాహం చేయడంతో ఓ యువతి భర్తను వదిలేసి తన ప్రియుడి వద్దకు చేరుకుంది. ప్రియుడితో కలసి ఆమె గుడికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో దాడిచేసిన కొందరు దుండగులు.. సదరు యువకుడి చేతిని నరికేశారు. ఈ ఘటన బెంగళూరు బన్నేరుఘట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

 చిత్రదుర్గకు చెందిన ఓ యువతి(25), తుమకూరు జిల్లా మధుగిరిలోని మిడిగేశి రవీశ్(32) లు ప్రేమించుకున్నారు. అయితే యువతి ఇష్టాన్ని కాదని కుటుంబ సభ్యులు మరో యువకుడితో పెళ్లి చేశారు. దీంతో యువతి ఇంట్లో నుంచి పారిపోయి హోంగార్డుగా పనిచేస్తున్న ప్రియుడు రవీశ్ దగ్గరకు చేరుకుంది. వీరిద్దరూ మంగళవారం సాయంత్రం బన్నేరుఘట్టలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు.

అక్కడ వీరిద్దరూ కూర్చుని ఉండగా కొందరు దుండగులు మారణాయుధాలతో దాడిచేశారు. రవీశ్ కుడిచేతిని మణికట్టు వరకూ నరికేసి తమ వెంట తీసుకెళ్లిపోయారు. దీంతో సదరు యువతి స్థానికుల సాయంతో రవీశ్ ను ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News