USA: అమెరికాలో రెచ్చిపోయిన సైకో.. భార్య సహా ఐదుగురి కాల్చివేత!

  • అనంతరం అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
  • దక్షిణ కాలిఫోర్నియాలో ఘటన
  • విచారణ జరుపుతున్న పోలీసులు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దక్షిణ కాలిఫోర్నియాలో బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో ఓ సైకో తుపాకీతో ఇష్టానుసారం కాల్పులు జరుపుతూ భీతావహ పరిస్థితిని సృష్టించాడు. ఈ ఘటనలో నిందితుడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే తుపాకీతో నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

నగరంలోని ఓ ట్రక్కింగ్ కంపెనీ వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. దుండగుడు తొలుత రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిని కాల్చాడనీ, అనంతరం సమీపంలోని ఇంటికి వెళ్లి మరో ఇద్దరిపై కాల్పులు జరిపాడని వెల్లడించింది. ఆ తర్వాత కారు ఎక్కి ట్రక్కింగ్ కంపెనీ వద్దకు వచ్చి ఇంకోసారి కాల్పులు జరిపాడని పేర్కొంది. ఈ ఘటనలో నిందితుడి భార్య కూడా చనిపోయిందని తెలిపింది. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అమెరికాలో గత వారం రోజుల్లో కాల్పులు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఐదు రోజుల క్రితం ఓహియో రాష్ట్రంలోని ఫిఫ్త్ థర్డ్ బ్యాంకు వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్‌ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

More Telugu News