Hyderabad: పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ భర్తపై కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్టు

  • రెండేళ్ల క్రితం షూటింగ్‌లో పరిచయమైన చైతన్య
  • కొన్నాళ్లు సహజీవనం
  • దేవుడి ఫొటోల ఎదుట ఆమె మెడలో తాళి

దేవుడి ఫొటోల ముందు తాళి కట్టిన భర్త ఇప్పుడు ముఖం చాటేశాడంటూ హైదరాబాదు, కృష్ణానగర్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్టు (30) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖపట్టణానికి చెందిన బాధిత మహిళకు రెండేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో విజయవాడకు చెందిన చైతన్యతో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోని దేవుడి ఫొటోల ముందు ఆమె మెడలో చైతన్య తాళికట్టాడు. పెద్దలకు చెప్పి ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు.

విషయం తెలిసిన చైతన్య బంధువులు ఆగస్టు 13న హైదరాబాద్ వచ్చి చైతన్యను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. అతడితో ఫోన్‌లో మాట్లాడేందుకు బాధిత మహిళ ప్రయత్నించగా మాట్లాడేందుకు చైతన్య నిరాకరించాడు. దీంతో బుధవారం ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి చైతన్యపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News