Undavalli: నేనెప్పుడూ సచివాలయంలోనే ఉంటా...రేపు అయినా చర్చకు సిద్ధమే: ఉండవల్లికి కుటుంబరావు సవాల్

  • అమరావతి బాండ్ల జారీలో అవినీతి జరగలేదు
  • నిరూపిస్తే ఇరవై నాలుగు గంటల్లో రాజీనామా చేస్తా
  • ప్రజల్లో అపోహలు కలిగించొద్దు
  • ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

తానెప్పుడూ సచివాలయంలోనే ఉంటానని, పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలపై చర్చకు రేపు అయినా సిద్ధమేనని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి ఆయనకు సవాల్ విసిరారు. అమరావతి బాండ్ల జారీలో ఒక్క రూపాయి అయినా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమేనని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఏ వివరాలు కావాలన్నా ఇస్తామని, ఆ తరవాత కూడా చర్చకు రావొచ్చునని అన్నారు.

సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ, రెండు వారాల నుంచి  ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలకు పదే పదే సమాధానాలు ఇస్తున్నా కూడా ఇంకా అనుమానాలు వెల్లడించడం చాలా బాధాకరమని, గతంలో చెప్పా, ఇపుడూ చెబుతున్నా... తామిచ్చిన వడ్డీ కంటే తక్కువ వడ్డీ ఇస్తే, డబుల్ అరేంజర్ ఫీ ఇస్తామని సవాల్ విసిరారు. తాము .85 అరెంజర్ ఫీ ఇచ్చామని, తక్కువ వడ్డీకి ఎవరు తీసుకొచ్చినా 1.70 అరెంజర్ ఫీ ఇస్తామని, ఇప్పటికే ఎన్నో పర్యాయాలు చెప్పా, ప్రభుత్వ సంస్థయినా, ప్రైవేటు సంస్థయినా బాండ్లు ఇష్యూ చేస్తే ఆయా సంస్థల రేటింగ్ ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారని అన్నారు. ఇదే విషయం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా తెలిపారని, ట్రిపుల్ ఎ+, ట్రిపుల్ ఎ, ట్రిపుల్ ఎ - ఇవీ అత్యధిక రేటింగ్ లని అన్నారు.

ఆ తరువాత డబుల్ ఎ ప్లస్, డబుల్ ఎ, డబుల్ ఎ మైనస్, ఎ ప్లస్, ఎ, ఎ మైనస్.. ఇలా రేటింగ్ లు ఉంటాయని, తక్కువ వడ్డీ ట్రిపుల్ ఎ కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు వస్తాయని చెప్పారు. తరువాత వడ్డీ పెరిగి డబుల్ ఎ సంస్థలకు వస్తాయని, భారత దేశం రేటింగ్ ఇంకా ట్రిపుల్ బి దగ్గర ఉందని, వారం రోజుల నుంచి రూపాయి.. డాలర్ కు 72.85 పైసలకు పడిపోయిందని, దీంతో  ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ కూడా పెరిగిపోయిందని వివరించారు.

అమరావతి బాండ్లు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ 7.35గా ఉందని, ఇపుడు వాటి వడ్డీ 8.18కు పెరిగిందని చెప్పారు. నేడు అమరావతి బాండ్లను 10.32 వడ్డీకి ఇష్యూ చేశామని, దీనికంటే ఎవరైనా తక్కువ వడ్డీ రేటుకు తీసుకొస్తే, అరేంజర్ ఫీ డబుల్ ఇస్తామని, ఇప్పటికైనా ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చామని ఉండవల్లి అనడం సబబుకాదని అన్నారు.

సీఆర్డీయే రేటింగ్ ఎ ప్లస్ ఉందని, ఆ విధంగానే వడ్డీ రేటు నిర్ణయించారని, ఏడాది నుంచి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని, ఈ ఏడాది రెండు పర్యాయాలు వడ్డీ రేట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఇవేవీ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియనవి కాదని, ఆయనకు ఆర్థికాంశాలపై విశేష అహగాహన ఉందని అన్నారు.

అడ్వయిజర్, అరేంజర్ ఫీలు వేర్వేరు ఉంటాయని, సీఆర్డీయే అడ్వయిజర్ గా రూపాయికే ఏకే క్యాపిటల్ కోడ్ వేయడంతో ఓకే చేశామని, అరేంజర్ ఫీజుకు .85 కు ఏకే క్యాపిటల్ కోడ్ చేయడంతో అదే కంపెనీకి ఓకే చేశామని, ఇది చాలా తక్కువని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ముద్ద బిడ్డ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ 1.75 చెల్లించారని, తాము అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలిచ్చిన విధంగానే అరేంజర్ ఫీ చెల్లించామని, వడ్డీ రేటు, అరేంజర్ ఫీ ఎక్కువ చెల్లించలేదని స్పష్టం చేశారు.

పనులు చేయకుండానే బిల్లులు చెల్లించామని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించడం సరికాదని, పనులు జరగకుండా ఎవరూ బిల్లులు చెల్లించరన్న విషయం ఆయనకు తెలియనిది కాదని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా ఎంపీగా ఉన్న ఆయనకు బిల్లులు ఏ విధంగా మంజూరు చేస్తారో తెలుసని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథార్టీ తప్పు చేసిందా? అని ప్రశ్నించారు.

ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగేలా ఉండవల్లి అరుణకుమార్ ఆరోపణలు చేయడం, పట్టిసీమ ప్రాజెక్ట్ కు అదనపు చెల్లింపులు చేశామని ఆరోపించడం సరికాదని అన్నారు. అదనపు చెల్లింపులకు ఏ కాంట్రాక్టర్ అయినా బిడ్ చేయవచ్చని, ఉండవల్లి అరుణ్ కుమార్ స్నేహితులు, వైసీపీ నేతలకున్న సంస్థలు ఎందుకు బిడ్ చేయలేదని ప్రశ్నించారు.

అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టులను పూర్తి చేసిన సంస్థలను అభినందించాల్సి ఉందని, ప్రాజెక్టులు ఆలస్యమైతే ఎంతో వ్యయమవుతుందని, పట్టిసీమ అనుకున్న సమయానికి పూర్తి చేయడం వల్ల కృష్ణా డెల్టా పరిధిలో వేల కోట్ల రూపాయల విలువైన పంటలు సాగయ్యాయని, ఈ విషయాలన్నింటినీ ఆయన గుర్తుంచుకోవాలని, ఏది మంచి... ఏది చెడు అని గుర్తించాలని హితవు పలికారు.

పట్టిసీమ ప్రాజెక్టుపైనా చర్చకు తాను సిద్ధమేనని, పేదల అపార్టుమెంట్ల నిర్మాణంపై అసెంబ్లీ పూర్తి స్థాయిలో చర్చ జరిగందని కుటుంబరావు తెలిపారు. బీజేపీ సభ్యులు కూడా ఆ చర్చలలో పాల్గొన్నారని,  అసెంబ్లీ చర్చను చూసి ఉంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ కు కావాల్సిన అన్ని వివరాలు లభిస్తాయని అన్నారు.

ఇండస్ట్రీయల్ వెబ్ సైట్ లో రాష్ట్రంలో జరిగిన ఎంవోయూలు, వచ్చిన పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు లభించాయన్న వివరాలు ఉంటాయని, విశాఖలో జరిగిన భాగస్వామ్య సమిట్ లో రూ.18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు ఏమయ్యాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగుతున్నారని, ఏపీ స్టేట్ ఇండస్ట్రీయల్ వెబ్ సైట్ పరిశీలించినా, కావాలంటే తాను కూడా పూర్తి వివరాలు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర  ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు నచ్చి, ఎందరో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని, చేసుకున్న ఒప్పందాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమల రేటింగ్ ఏపీలో 38.42 శాతంగా ఉందని, దేశంలో ఇదే అత్యధికమని చెప్పారు. వివిధ దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న వివిధ ఎంవోయూల్లో 17, 18 శాతం మాత్రమే ఉందని, ప్రజల్లో అపోహలు కలిగేలా మాట్లాడవద్దని ఉండవల్లి అరుణ్ కుమార్ కు సూచించారు.

వైఎస్ అవినీతిపరుడని ఉండవల్లి అంగీకరించినట్టే!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతి పరుడు కాదని తానెప్పుడు అనలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయాన్ని కుటుంబరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా వైఎస్ అవినీతి పరుడేనని ఆయన అంగీకరించారని, వైఎస్ ఏమీ వివేకానందుడు, మహాత్ముడు కాదని అన్నారు. ‘మనీ టేకింగ్, మనీ మేకింగ్’ అంటూ కొత్త సిద్ధాంతాన్ని ఉండవల్లి చెప్పారని, ఈ పదాలను తానెప్పుడు వినలేదని అన్నారు. ‘మనీ మేకింగ్’ అంటే సొంతానికి, ‘మనీ టేకింగ్’ అంటే పార్టీకి ఎన్నికల నిధుల కోసం సమీకరణ అని, మనీ టేకింగ్ అవినీతి కాదని ఉండవల్లి అంటున్నారని అన్నారు. వైఎస్ ‘మనీ టేకింగ్’ చేశారని ఉండవల్లి అన్నారని, అంటే ఏమిటో తనకు అర్థం కావడం లేదని కుటుంబరావు చెప్పారు.

వైఎస్ పై వచ్చిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై తానెప్పుడూ చర్చకు సిద్ధమేనని కుటుంబరావు మరోసారి స్పష్టం చేశారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బెల్ కొట్టడానికి రూ.1.80 కోట్లు ఖర్చు చేశారని ఉండవల్లి ఆరోపించడం సరికాదని, ముంబయి వెళ్లింది బెల్ కొట్టడానికే కాదని, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యేందుకు నాడు వెళ్లామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు టీకొట్లలో, టిఫిన్ పార్లర్ లో నిర్వహిస్తామా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందీ వెల్లడిస్తారని ఉండవల్లికి సూచించారు. తక్కువ మొత్తంలోనే ఖర్చు చేశామని, ఇంకా పూర్తిస్థాయిలో బిల్లులు కూడా చెల్లించలేదని, లేనిపోని దుబారా చేస్తున్నామని ఉండవల్లి ఆరోపించడం తగదని కుటుంబరావు అన్నారు.

ఉండవల్లి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఎన్నో పర్యాయాలు ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ మీడియా ద్వారా సమాధానాలు చెప్పామని, ఈ సమాధానాలను ఆయన విననట్లుగా ఉందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని వివరాలు ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఇస్తామని, ఆ తర్వాత అయినా ఆయన చర్చకు రావొచ్చునని కుటుంబరావు సూచించారు.

More Telugu News