paruchuri: అర్ధరాత్రి నా ఇంట్లో ఫోన్ మోగింది .. ఆయన నిజాన్ని అంగీకరించాడు: పరుచూరి గోపాలకృష్ణ

  • నేను ఆ పాత్ర చేయడం దర్శకుడికి ఇష్టం లేదు
  • నాయుడుగారు నాతోనే ఆ పాత్ర చేయించారు 
  • దర్శకుడు తన అభిప్రాయం మార్చుకున్నాడు  

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, బాలకృష్ణ .. విజయశాంతి జంటగా నటించిన 'కథానాయకుడు' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో నేను ఒక పాత్ర చేశాను .. ఆ పాత్రను సత్యనారాయణగారితో గానీ .. రావు గోపాలరావుగారితో గాని చేయించాలనేది దర్శకుడు మురళీ మోహనరావు ఆలోచన. ఆ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందనేది నిర్మాతగా రామానాయుడుగారి అభిప్రాయం.

నేను ఆ పాత్ర చేయడం మురళికి నచ్చడం లేదని తెలిసి .. నాకు సంబంధించిన ట్రాక్ అంతా కూడా మా అన్నయ్య వెంకటేశ్వరరావుతో నాయుడుగారు డైరెక్ట్ చేయించారు. నాకు సంబంధించిన ఏ డైలాగ్ ను మురళి తీసేయకుండా నాయుడు గారు చూసుకున్నారు.

మర్నాడు ఉదయం సినిమా విడుదలవుతుందనగా ఆ రోజు అర్ధరాత్రి మా ఇంట్లో ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తగానే మురళి నాకు సారీ చెప్పాడు .. 'మీరు చేసిన పాత్రను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేదు .. చాలా కొత్తగా కనిపించారు .. నాయుడు గారు చెప్పింది నిజం .. ఇది పాత ఆర్టిస్టులు చేసి వుంటే బోర్ కొట్టేదేమో' అన్నాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా ఆ పాత్ర చేశానే అనే ఒక బాధ ఆ మాటతో పోయింది .. ఆ సినిమా పాతిక వారాల షీల్డ్ తెచ్చుకోవడం సంతోషాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News