petrol: షరా మామూలే.. ఈరోజు కూడా పెరిగిన పెట్రో ధరలు!

  • భారత్ బంద్ ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు
  • హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ. 85.60
  • ముంబైలో రూ.88.26కు చేరుకున్న పెట్రోల్ ధర  

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటి ప్రభావం నిత్యావసర వస్తువులపై కూడా పడుతోంది. దీంతో, సామాన్యుల కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా నిన్న భారత్ బంద్ జరిగింది. అయినా, అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, ఇటు చమురు సంస్థలకు కానీ చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఈ రోజు యథాప్రకారం పెట్రో ధరలు మరింత పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 23 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.87కు, డీజిల్ ధర రూ. 72.97కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.26కు చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ. 85.60కు ఎగబాకింది. డీజిల్ ధర లీటర్ కు 24 పైసలు పెరిగి రూ. 79.22కు చేరుకుంది.

More Telugu News