Visakhapatnam District: నవంబర్ లో విశాఖలో టెక్-2018

  • నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు టెక్-2018
  • నాలుగు రోజులు జరగనున్న టెక్
  • టెక్ లో నిర్వహించనున్న 3 వర్క్ షాపులు 

విశాఖపట్నంలో నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే టెక్ (ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమానిటీ)- 2018 నిర్వహణ గురించి ఏపీ సచివాలయం 4వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని యునెస్కో-ఎంజీఐఈపీ (మహాత్మా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్) సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్ లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపికైన పాఠశాలల, జూనియర్ కాలేజీల, డిగ్రీ కాలేజీల, యూనివర్సిటీల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరవుతారు.

నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మూడు వర్క్ షాపులు, కేటలిటిక్ సెషన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం, ప్రధాన ఉపన్యాసం, ముగింపు ఉత్సవం, హాజరయ్యేవారికి వసతి సౌకర్యం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మీడియా కవరేజ్, ముఖ్యఅథితులకు ఏర్పాట్లు, సెక్యూరిటీ తదితర నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు. ఈ సమావేశంలో కాలేజీ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ సుజాత శర్మ, యునెస్కో-ఎంజీఐఇపీ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎబల్ కేర్, యునెస్కో అధికారి సమితా రస్తోగి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News