HDFC BANK: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఎదుగుదల తట్టుకోలేక హత్య చేయించిన సహోద్యోగులు!

  • పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
  • బయటపెట్టిన కాంట్రాక్ట్ కిల్లర్
  • నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు

ముంబయ్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న సిద్ధార్థ కిరణ్‌ సంఘ్వీ గత బుధవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. తాజాగా సంఘ్వీ మృతదేహాన్ని ఈ రోజు కళ్యాణ్ హైవే పక్కన పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు.. సర్ఫరాజ్ షేక్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సర్ఫరాజ్ ను తమదైన శైలిలో విచారించగా తానే ఈ హత్య చేసినట్లు అతను అంగీకరించాడు.

సంఘ్వీ వృత్తిలో అంచెలంచెలుగా ఎదగడం, పదేళ్లలోనే మూడు సార్లు ప్రమోషన్లు పొందడంతో అసూయతో రగిలిపోయిన కొందరు సహోద్యోగులు తనకు సుపారీ ఇచ్చారని వెల్లడించాడు. సంఘ్వీని హత్యచేసి కళ్యాణ్ హైవే పక్కన పడేసినట్లు పేర్కొన్నాడు. సర్ఫరాజ్ వాంగ్మూలం నేపథ్యంలో ఓ మహిళ సహా మరికొంతమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ్వీ ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయినట్లు ఎన్‌ఎమ్‌ జోషి మార్గ్‌ పోలీసులకు ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

2007లో హెచ్‌డీఎఫ్‌సీలో సీనియర్‌ మేనేజర్‌గా చేరిన సంఘ్వీ ఆ తర్వాత నాలుగేళ్లకే అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. 2015లో డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా, మరో రెండేళ్లకే వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి సాధించారు. ఉద్యోగంలో చేరిన పదేళ్లలో మూడు సార్లు పదోన్నతి పొందడంతో అసూయ చెందిన సహోద్యోగులు కొందరు సంఘ్వీ హత్యకు సుపారీ ఇచ్చారు.

More Telugu News