Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డిని రహస్యంగా కలిశారన్న వార్తలపై దానం నాగేందర్ స్పందన!

  • నాపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • ఉత్తమ్ ను కలవాల్సిన అవసరం కూడా నాకు లేదు
  • కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, ఇటీవలే కారెక్కిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు. 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో దానం పేరు లేదు. దీంతో, దానం అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, హైదరాబాదులోని ఓ హోటల్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన రహస్యంగా కలిశారనే వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై దానం నాగేందర్ స్పందించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని తాను కలవలేదని, ఆయనను కలవాల్సిన అవసరం కూడా తనకు లేదని దానం తెలిపారు. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. కావాలనే కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కనే ఇలాంటి దుష్ప్రచారానికి పూనుకుంటోందని విమర్శించారు. 

More Telugu News