Telangana: పదమూడేళ్ల బాలికపై నలుగురు బాలుర లైంగిక దాడి!

  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన
  • బాధితురాలి నానమ్మ ఫిర్యాదు
  • పోలీసుల అదుపులో నిందితులు

పదమూడేళ్ల బాలికపై నలుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలక్‌నుమా ఏసీపీ సయ్యద్‌ ఫయాజ్‌ తెలిపిన వివరాల మేరకు... సుల్తాన్‌సాహి ప్రాంతానికి చెందిన బాధిత బాలిక తల్లిదండ్రుల మధ్య విభేదాలున్నాయి. ఈ కారణంగా ఆమె నానమ్మ వద్ద ఉంటోంది. అప్పుడప్పుడూ అంబికానగర్‌ ప్రాంతంలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చి వెళ్తుంటుంది.

ఈ క్రమంలో గౌలిపురా మేకల మండీ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురతో ఈమెకు పరిచయమయింది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన ఈ ఇద్దరు బాలురు తమ స్నేహితులు మరో ఇద్దరితో కలిసి బాధిత బాలికను మేకల మండీ మైదానానికి తీసుకువెళ్లారు. అక్కడ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బాధిత బాలిక తన నానమ్మకు చెప్పడంతో ఆమె మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికకు వైద్య పరీక్షలు చేయించి నింబోలి అడ్డాలోని ఆశ్రమానికి తరలించారు. శనివారం నిందితులైన నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News