Madhu Yaskhi: నవ్వొస్తోంది... సురేష్ రెడ్డి బకరా అయిపోయిండు: మధు యాష్కి

  • ఆర్మూరులో ఆయన గెలిచే పరిస్థితి లేదు
  • సురేష్ రెడ్డి భంగపడటం ఖాయం
  • కాంగ్రెస్ కు నష్టం లేదన్న మధు యాష్కి

తమను వదిలి టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఓ బకరా అయిపోయాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, "నాకు నవ్వొస్తోంది. సురేష్ రెడ్డి... పాపం బకరా అయిపోయిండు. నాకు క్లాస్ మేట్. కలిసి చదువుకున్నం. స్పీకర్ గా ఉండి, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడే గెలవలేని వ్యక్తి. మళ్లీ టికెట్ ఇచ్చినం ఓడిపోయిండు. మళ్లీ టికెట్ ఇచ్చినం ఓడిపోయిండు. ఇవాళ ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఆర్మూర్ లో సురేష్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదన్నా... ఆయన్ను మార్చండి అంటూ ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు" అని అన్నారు.

ఆయన ఆశపడి టీఆర్ఎస్ దగ్గరకు వెళ్లారో లేక అభివృద్ధి చూసి వెళ్లారో తనకు తెలియదుగానీ, భంగపడటం మాత్రం ఖాయమని చెప్పారు. ఇది వర్షాకాలమని, పాత నీరు పోయి, కొత్త నీరు వచ్చే సమయమని, సురేష్ రెడ్డి వంటి వాళ్లు ఎంతమంది పోయినా, కాంగ్రెస్ పార్టీకి నేతల కరవుండదని అన్నారు.

More Telugu News