Serena Williams: అంపైర్‌పై రంకెలేసిన సెరెనా విలియమ్స్‌కు రూ.12 లక్షల జరిమానా!

  • యూఎస్ ఓపెన్‌లో ఒసాకా చేతిలో ఓటమి
  • అంపైర్‌ను దొంగ అంటూ దూషించిన సెరెనా
  • తీవ్రంగా పరిగణించిన రిఫరీ

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ఓడిపోయి అంపైర్‌పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించింది. దుర్బాషలాడినందుకు 10 వేల డాలర్లు, కోచ్ ను సంప్రదించినందుకు 4 వేల డాలర్లు, రాకెట్‌ను విసిరికొట్టినందుకు 3 వేల డాలర్ల చొప్పున మొత్తం 17 వేల డాలర్ల (రూ.12 లక్షలు) జరిమానా విధించింది.  

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో జపాన్ యువ క్రీడాకారిణి నవోమీ ఒసాకా చేతిలో  6-2, 6-4 తేడాతో సెరెనా ఓటమి పాలైంది. 24వ మేజర్ టైటిల్‌పై కన్నేసిన సెరెనా ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. తొలి సెట్ తర్వాత కోచ్‌ను సంప్రదించినందుకు చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో సెరెనా రెచ్చిపోయింది.  "నువ్వో అబద్ధాల కోరువి. దొంగవి. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే" అంటూ రంకెలేసింది. అంతకుముందు తన రాకెట్ ను బలంగా నేలకేసి కొట్టి విరిచింది. నియమావళిని ఉల్లంఘించి కోర్టులో విరుచుకుపడిన సెరెనా తీరును తీవ్రంగా పరిగణించిన రిఫరీ కార్యాలయం ఆమెపై జరిమానా విధించింది.

More Telugu News