KCR: పాలకుర్తి సీటు విషయంపై పునరాలోచించాలి!: కేసీఆర్ కు టీఆర్ఎస్ నేత రవీందర్‌రావు విజ్ఞప్తి

  • టీఆర్ఎస్ టికెట్ దక్కని నేతల్లో బయటపడుతున్న అసంతృప్తి
  • పాలకుర్తి టికెట్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్‌కు వినతి
  • దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరాక అభివృద్ధి శూన్యమని విమర్శ 

ఉద్యమకారులను కాపాడే బాధ్యత తనకివ్వాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు కోరారు. టీఆర్ఎస్ తరుపున టికెట్ లభించని నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి అసంతృప్తిని వెళ్లగక్కుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. రవీందర్‌రావు పాలకుర్తి నుంచి టికెట్ ఆశించారు కానీ ఆయనకు నిరాశే మిగిలింది. ఆదివారం రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారులకు ఎలాంటి సహాయ సహకారాలు లభించడం లేదని.. వారిని కాపాడే బాధ్యతను తనకివ్వాలని పేర్కొన్నారు.

 2004 నుంచి వరుసగా మూడు పర్యాయాలు టికెట్ ఆశించానని.. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు తప్పుకున్నానని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పాలకుర్తిలో అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానం విషయంలో కేసీఆర్ పునరాలోచించి ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News