Telangana: జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విమర్శ!

  • దివాకర్ రెడ్డికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదు
  • అధికార పార్టీలో ఉన్నా పోలీస్ వ్యవస్థపై ఆరోపణలు
  • పల్లె రఘునాథరెడ్డిని పరామర్శించిన చినరాజప్ప

తమ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. దివాకర్ రెడ్డికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదని, అధికార పార్టీలో ఉన్నా పోలీస్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి సతీమణ ఉమాదేవి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘునాథరెడ్డిని పరామర్శించే నిమిత్తం ఈరోజు ఆయన అనంతపురం వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా స్పందించారు. అలాగే వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ, జగన్ తప్పు చేశారు కనుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. తెలంగాణలో ఎన్నికల పొత్తు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి అక్కడి పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చంద్రబాబు నిర్ణయం చేస్తారని చెప్పారు. అయితే, ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని అన్నారు.

More Telugu News