Banks: రేపు భారత్ బంద్.. అయినా బ్యాంకులు పనిచేస్తాయంటున్న అధికారులు!

  • రేపు మామూలుగా బ్యాంకులు పనిచేస్తాయన్న అధికారులు
  • అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక
  • బంద్‌ను విజయవంతం చేయడమే లక్ష్యంగా అడుగులు

పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ జరగనుంది. బంద్‌ను ఎలాగైనా విజయవంతం చేయాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దీంతో రేపు బ్యాంకులు పనిచేయడంపై సందిగ్ధం నెలకొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం కోసం ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. అయితే, భారత్ బంద్ నేపథ్యంలో బ్యాంకులు తెరుచుకోవడంపై వెల్లడవుతున్న అనుమానాలపై అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పష్టత ఇచ్చింది.

సోమవారం యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయని ఉద్యోగుల సంఘం తెలిపింది. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బ్యాంకు కార్యకలాపాలు సోమవారం మామూలుగానే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ పనిచేయకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఫలితంగా బంద్‌ను విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను కళ్లకు కట్టాలని చూస్తోంది. ప్రజల పక్షాన నిలిచే పార్టీలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది. అనుకున్నట్టే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు ముందుకొచ్చాయి.

More Telugu News