sivaji: నచ్చకపోతే చంద్రబాబును చంపేయండి.. రేపు జగన్ నచ్చకపోతే ఆయననూ చంపేయండి: కేంద్ర ప్రభుత్వంపై శివాజీ ఆగ్రహం

  • బ్రిటీష్ వారి సిద్ధాంతాలను జాతీయ ప్రభుత్వాలు ఒంటబట్టించుకున్నాయి
  • చంద్రబాబుపై దాడి జరగబోతోందని తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు
  • రాజకీయాలు నీతిబద్ధంగా ఉండాలి

ఏపీపై బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ కొత్త రూపు దాల్చుకుందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని మరింత అంధకారంలోకి నెట్టేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టిందని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇబ్బందులకు గురి చేసేందుకు ఇలాంటి దారుణమైన పనులు అవసరమా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ వారు నేర్పిన విభజించు, పాలించు అనే సిద్ధాంతాన్నే జాతీయ ప్రభుత్వాలు ఒంటబట్టించుకున్నాయని విమర్శించారు. చంద్రబాబుపై దాడి జరగబోతోందని రాత్రి తెలిసినప్పటి నుంచి తనకు నిద్ర లేకుండా పోయిందని అన్నారు.  

మీ పార్టీ ప్రయోజనాల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారా? అని కేంద్రంపై శివాజీ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నచ్చకపోతే ఆయన్ని చంపేయండని, రేపు జగన్ నచ్చకపోతే ఆయననూ చంపేయండని, ఆ తర్వాత ఎవరు నచ్చకపోతే వాళ్లందరినీ చంపేయండని ఆవేశంగా అన్నారు.. ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ్నించారు. రాజకీయాలు నీతిబద్ధంగా ఉండాలని, వ్యక్తిగతంగా తీసుకుని టార్గెట్ చేయడమేంటని? దుయ్యబట్టారు.

More Telugu News