Jana Reddy: గులాబీ జెండా పట్టుకుంటానని నేనెప్పుడు చెప్పా?: కేసీఆర్ కు జానారెడ్డి కౌంటర్

  • కేసీఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు
  • ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి
  • నేను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని... ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను అన్నట్టు కేసీఆర్ చెబుతున్నారని... ఆ మాటను తానెప్పుడూ అనలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని తెలిపారు.

తాను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఆరోపణలు నిరూపించలేకపోతే కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలు అర్థంపర్థం లేనివని మండిపడ్డారు. తాను అనని మాటలను అన్నట్టుగా చెప్పడం దారుణమని అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పారు.

నిన్న హుస్నాబాద్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, జానారెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే గులాబీ జెండా పట్టుకుని, టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి అన్నారని... 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న విషయం జానారెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఈరోజు జానారెడ్డి స్పందించారు. 

More Telugu News