Kurnool District: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్త.. ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య!

  • కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన
  • అక్రమ సంబంధంపై భర్త నిలదీత
  • కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలికొంది. భార్య అక్రమ సంబంధాన్ని భర్త ప్రశ్నించడంతో ఆగ్రహానికి లోనైన ఆమె ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని దారుణంగా హత్య చేసింది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం బోయినపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బోయినపల్లికి చెందిన శివరాములు లక్ష్మీదేవిని 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాదాపు నెల రోజుల క్రితం కుమార్తెకు వివాహం చేశారు. అయితే ఇదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో లక్ష్మీదేవికి ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో అల్లుడు, కుమార్తె ఇంటికి వచ్చారు. కాగా, వివాహేతర సంబంధంపై గురువారం రాత్రి శివరాములు, లక్ష్మీదేవిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం ఇంటిబయట అరుగుపై శివరాములు నిద్రపోగా, రామకృష్ణ, లక్ష్మీదేవి కలిసి వేటకొడవళ్లతో మెడపై నరికి హత్యచేశారు. అనంతరం అతనిని ఇంటిపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేశారు. మిద్దె పై నుంచి పడిపోయి శివరాములు చనిపోయినట్లు అందరినీ నమ్మించారు.

అయితే ఇంటిపై మట్టి ఉండటం, శివరాములు మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అక్కడ ఇది పక్కా హత్య అని తేలడంతో పోలీసులు వీరిద్దరినీ ప్రశ్నించారు. దీంతో తామే శివరాములును హత్యచేశామని ఇద్దరూ ఒప్పుకున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు.

More Telugu News