Telangana: టీఆర్ఎస్‌లో బుజ్జగింపులు షురూ.. బాబుమోహన్‌కు కేసీఆర్ అభయం!

  • బాబు మోహన్‌, ఓదెలుకు ఎమ్మెల్సీ పదవి
  • ఫాంహౌస్‌కు పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్
  • కొండా సురేఖ స్థానంలో బస్వరాజు సారయ్య?

టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి విడత జాబితాలో పేర్లు కనిపించని నేతలు అలకబూనగా.. బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చే పనిలో పడ్డారు. రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఇచ్చారు. తొలి విడత జాబితాలో చోటు దక్కని బాబుమోహన్, నల్లాల ఓదెలును శుక్రవారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానం అవసరం లేదని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కానీ, ఇతర పదవులు కానీ ఇస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు ఖైరతాబాద్ టికెట్‌ను తన కుమార్తె విజయలక్ష్మికి లేదంటే కుమారుడు విప్లవ్ కుమార్‌కు ఇవ్వాలని కేకే పట్టుబడుతున్నట్టు సమాచారం. దానం నాగేందర్ విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, అభ్యర్థులను ప్రకటించని వరంగల్‌ తూర్పు, చొప్పదండి, మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

టికెట్ దక్కని కొండా సురేఖ నేడు టీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తుండడంతో ఆమె విషయాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. వరంగల్ తూర్పు స్థానాన్ని బస్వరాజు సారయ్య ఆశిస్తుండగా, మల్కాజిగిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ మల్లారెడ్డి ఆశిస్తున్నారు. ఇక మేడ్చల్, వికారాబాద్ స్థానాలను వలస నేతలతో భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News