sonali Bendre: సోనాలి బింద్రే చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!

  • తనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రామ్ కదమ్
  • ట్రోల్ చేసిన నెటిజన్లు
  • క్షమాపణలు చెప్పిన వివాదాస్పద ఎమ్మెల్యే

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేయాలని యువకులకు పిలుపునిచ్చి వార్తల్లోకి ఎక్కిన ఆయన తాజాగా మరోమారు చిక్కుల్లో పడ్డారు. కేన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కన్నుమూసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. తనకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసిన ఆయన దానిని యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తూ ఆటాడుకున్నారు.

ఎమ్మెల్యేకు వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌లో.. ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం’ అని రాసుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసిన రామ్ కదమ్.. ఆ మెసేజ్‌లోని సమాచారాన్ని నిర్ధారించుకోకుండా యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

తాను మెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్టు సోనాలి బింద్రే జూలై 4న వెల్లడించడంతో హిందీ చిత్రపరిశ్రమ సహా అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో చికిత్స పొందుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంటోంది. కాగా, తాజా వివాదంపై రామ్ కదమ్ స్పందిస్తూ.. తాను క్షమాపణలు చెప్పానని, దీంతో ఈ వివాదం సమసిపోయిందని పేర్కొన్నారు.

More Telugu News