Vijay mallya: మాల్యా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.. చివరి టెస్టు మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన ఆర్థిక నేరస్తుడు!

  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • స్టేడియంలోకి వస్తున్న మాల్యా
  • ఇంగ్లండ్‌లో ఎంజాయ్

భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇంగ్లండ్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు మళ్లీ వచ్చాడు. భారత అధికారులు అతడిని దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తుంటే అతడు ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో ఓసారి మ్యాచ్‌కు వచ్చి భారత అధికారుల పక్కన కూర్చుని మ్యాచ్‌ను తిలకించిన మాల్యా.. తాజాగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో దర్శనమిచ్చాడు. మ్యాచ్‌ను తిలకించేందుకు స్టేడియం లోపలికి వస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనను కలిసేందుకు గతంలో మాల్యా ప్రయత్నించగా, భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో మ్యాచ్ చూసుకుని వెళ్లిపోయాడు. తాజాగా మరోమారు మ్యాచ్‌కు వచ్చి కలకలం రేపాడు. ఇంగ్లండ్ నుంచే తన వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న మాల్యాను దేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

More Telugu News