paruchuri: ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ 'ఒక రోజు' వస్తుంది: పరుచూరి గోపాలకృష్ణ

  • ఒక సాధారణ ప్రేక్షకుడిగానే సినిమాలు చూస్తాను 
  • అలాగే 'గూఢచారి' సినిమా చూశాను
  • అడివి శేష్ ఎన్నికష్టాలు పడ్డాడో తెలుసు      

రచయితగా ఎన్నో సినిమాలకి పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ, కొత్తగా వస్తోన్న సినిమాలను చూస్తూ వాటిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వుంటారు. అలా తాజాగా ఆయన 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'గూఢచారి' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఎప్పుడైనా సరే నేను సినిమా చూసేటప్పుడు .. ఒక సాధారణ ప్రేక్షకుడిగానే చూస్తాను. నా వెనకాల 400 సినిమాల చరిత్ర ఉందని నేనెప్పుడూ భావించను. అలా భావించడం వలన ఆ సినిమా ఎక్కకుండాపోయే అవకాశం వుంది.

అందుకే ఒక సగటు ప్రేక్షకుడిగానే ప్రతి సినిమాను చూస్తాను. అలా 'గూఢచారి' సినిమా చూసిన నాకు ఆ సినిమా నచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి ముందుగా అభినందించవలసింది స్క్రీన్ ప్లే రైటర్స్ ను. ఇక కథా రచనలోనూ అడివి శేషు పాల్గొన్నాడు. ఆయన ఎన్నేళ్లుగా ఇక్కడ కష్టపడుతూ వస్తున్నాడో నాకు తెలుసు. చిత్రపరిశ్రమలో ప్రతి ఒక్కరికి 'ఒకరోజు' వస్తుంది .. అలా అడివి శేష్ కి కూడా 'గూఢచారి' సినిమాతో ఒకరోజు వచ్చింది .. అద్భుతమైన విజయాన్ని అందించింది" అని చెప్పుకొచ్చారు.      

More Telugu News