kcr: కాంగ్రెస్ నాయకులేమైనా గంధర్వులా? పైనుంచి దిగి వచ్చారా?: కేసీఆర్

  • రాష్ట్రంలోని పేదరికానికి కారణం కాంగ్రెస్సే
  • ఈ ఎన్నికలు రావడానికి కాంగ్రెస్సే కారణం
  • అసెంబ్లీని రద్దు చేస్తే.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు

హుస్నాబాద్ సభలో కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల నోళ్లకు హద్దూ, పద్దూ లేదని విమర్శించారు. అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదరికానికి కాంగ్రస్ పార్టీ కారణం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలేమైనా గంధర్వులా? పైనుంచి దిగి వచ్చారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని... ఈ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ముందస్తు ఎన్నికలకు సిద్ధమని అన్ని పార్టీలు ప్రకటించాయని... ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తే, ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని చెప్పారు. ఎన్నికలు వచ్చాయంటే అమలు చేయలేని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనని అన్నారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడైనా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సమైక్య పాలనలో గళమెత్తి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ఈ ఎన్నికలు రావడానికి కాంగ్రెస్సే కారణమని తెలిపారు. 

More Telugu News