kcr: పవిత్ర శ్రావణ శుక్రవారం నాడు మీ దర్శనానికి నన్ను భగవంతుడు పంపించాడు: హుస్నాబాద్ సభలో కేసీఆర్

  • ప్రచార యుద్ధాన్ని ప్రారంభించిన కేసీఆర్
  • నాలుగేళ్ల బిడ్డ తెలంగాణ ఆర్థికంగా దూసుకుపోతోంది
  • దేశ దరిద్రానికి కారణం కాంగ్రెస్సే

హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రచార యుద్ధాన్ని ప్రారంభించారు. పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు మీ దర్శనం కోసం భగవంతుడు తనను పంపించాడని అశేష జనవాహినిని ఉద్దేశించి అన్నారు. నాలుగేళ్ల బిడ్డ అయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని... ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖే చెప్పిందని తెలిపారు.

ఒక్కొక్క రూపాయిని పొదుపు చేసి కుటుంబం కోసం ఎలా ఎత్తి పెడతామో... ఆదే విధంగా ఆదాయాన్నంతా ఎత్తి పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఖర్చు చేశామని చెప్పారు. యావత్ దేశం పేదరికంలో మగ్గుతోందని... దీనికంతా కారణం ఎవరని ప్రశ్నించారు. పక్కనున్న చైనాతో పోల్చితే మన దేశం ఎన్నో రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పారు. దేశంలో ఎంతో నీరు ఉన్నప్పటికీ, దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ దరిద్రానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు.

More Telugu News