ap cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ‘యువనేస్తం’కు పచ్చజెండా!

  • ఈ నెల 14 నుంచి ‘యువనేస్తం’ రిజిస్ట్రేషన్లు 
  • అక్టోబరు 2 నుంచి నిరుద్యోగభృతి ఇవ్వాలని నిర్ణయం
  • మంత్రి కాలువ శ్రీనివాసులు

అమరావతిలో ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ‘ముఖ్యమంత్రి- యువనేస్తం’, అన్ని మునిసిపాలిటీల్లో బీపీఎస్ అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లింపు తదితర అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 14 నుంచి ‘యువనేస్తం’ రిజిస్ట్రేషన్లు ఆన్ లైన్ లో చేసుకోవచ్చని, అక్టోబరు 2 నుంచి నిరుద్యోగభృతి ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించినట్టు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు.

పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందని, ఈ నిర్ణయంతో ముప్పై వేల మందికి నెలసరి జీతం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు పెరగనున్నట్టు కాలువ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు కరవు భత్యాలు పెండింగ్ లో ఉన్నాయని, అందులో ఒక కరవు భత్యం చెల్లించేందుకు రూ.627 కోట్లు అవసరమని, ఆగస్టు 1 నుంచి ఆక్వా రైతులకు కరెంటును యూనిట్ ధర రూ.2 లెక్కన ఇవ్వనున్నట్టు కాలువ తెలిపారు.

More Telugu News