kcr: కేసీఆర్ స్వార్థప్రయోజనాల కోసమే అసెంబ్లీ రద్దు నిర్ణయం: కోదండరామ్

  • అసలు, ‘ముందస్తు’కు ఎందుకు వెళ్తున్నారు?
  • ఓటమి భయంతోనే కావచ్చు
  • వాస్తవానికి ‘ముందస్తు’కు టీఆర్ఎస్ సిద్ధంగా లేదు

సీఎం కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసమే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారని, ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో తెలియదు కానీ, తమకు ఉన్న సంపూర్ణ అధికారాలను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని మండిపడ్డారు.

ఎన్నికల ముందు ఆరు నెలలు అన్నది ఏ పార్టీకైనా చాలా కీలకమని, వాస్తవం చెప్పాలంటే, ముందస్తుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని అన్నారు. ఎటువంటి కారణం లేకుండానే ముందస్తుకు కేసీఆర్ వెళుతున్నారని, రాజకీయ గందరగోళం సృష్టించేందుకే ఇదంతా చేస్తున్నారన్నది తన అభిప్రాయమని అన్నారు. ఒకవేళ ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం కార్యాచరణ ప్రణాళిక వేసుకుని దానిపై దృష్టి పెడతామని చెప్పారు.

More Telugu News