Chandrababu: అసెంబ్లీకి రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు?: వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫైర్

  • అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదు
  • పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం
  • అక్టోబర్ 2న యువనేస్తం పథకాన్ని ప్రారంభిస్తాం

వైసీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వని బీజేపీకి అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. రాజధానికి ఓ రూపు వచ్చిందని తెలిపారు. యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని చెప్పారు. తెలంగాణకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధించింది ఏపీ మాత్రమేనని ముఖ్యమంత్రి తెలిపారు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమాతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువనేస్తం (నిరుద్యోగ భృతి) పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని చెప్పారు. పీడీ అకౌంట్లపై విపక్ష నేతలు రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. 

More Telugu News