paruchuri: రావు గోపాలరావుగారు చెప్పిన మాట విని వుంటే బాగుండేదని ఇప్పటికీ బాధపడుతూ వుంటాను: పరుచూరి గోపాలకృష్ణ

  • అన్నయ్య రెండో కొడుక్కి బ్లడ్ కేన్సర్ వచ్చింది 
  • ఫలానా చోటుకు తీసుకెళ్లమని రావు గోపాలరావు చెప్పారు 
  • అక్కడికి తీసుకెళ్లలేక పోయాము

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తనని తరచూ బాధించే ఒక విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. "1989లో మా అన్నయ్య గారి రెండో అబ్బాయికి బ్లడ్ కేన్సర్ వచ్చింది. అపోలో హాస్పిటల్లో ట్రీట్ మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాం. ఆ కుర్రాడి రూమ్ లోకి నెల రోజుల పాటు ఎవరూ వెళ్లొద్దనీ .. అలా చేయడం వలన తిరగబెట్టే అవకాశం ఎక్కువని డాక్టర్లు చెప్పారు.

ఈ విషయాన్ని నేను సెట్లో రావు గోపాలరావుగారికి చెప్పాను. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక రాజుగారికి ఇలాంటి కేన్సర్ వచ్చినప్పుడు, కేరళలో ఫలానా చోటుకి ఆయనని తీసుకెళ్లి వైద్యం చేయించారని రావు గోపాలరావు అన్నారు. ఆ తరువాత ఆ రాజుగారు 36 సంవత్సరాల పాటు బతికాడనీ .. అక్కడికి తీసుకెళ్లండి అని చెప్పారు.

నేను వెంటనే వెళ్లి మా అన్నయ్యా వదినలకి ఈ విషయం చెప్పాను. ఏం జరుగుతుందోననే భయంతో మా వదిన వద్దంది .. ఆ తరువాత ఆ బిడ్డ లేడు .. మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా బిడ్డను బతికించడం కోసం రావు గోపాలరావు ఒక మంచి మాట చెప్పారు .. అది వినిపించుకోలేదే అనే బాధ ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతూనే వుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News