ys jagan: జగన్ ని ఎందుకు ముఖ్యమంత్రిని చెయ్యాలి?: కేఈ కృష్ణమూర్తి

  • జగన్ కు ప్లాట్ ఫామ్ గా ఏదీ లేదు!
  • బజార్లలో తిరుగుతూ చంద్రబాబుని తిడతాడు
  • తనను ముఖ్యమంత్రిని చేయమంటాడు

జగన్ కు ప్లాట్ ఫామ్ గా అసెంబ్లీ గానీ పార్లమెంట్ గానీ ఏదీ లేదని, బజార్లలో తిరుగుతున్నాడని  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ బజార్లలో తిరుగుతూ చంద్రబాబుని తిడుతున్నాడని, తనను ముఖ్యమంత్రిని చేయమంటున్నాడని, అసలు, దేని గురించి జగన్ ని ముఖ్యమంత్రి చెయ్యాలి? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావట్లేదని గతంలో ప్రశ్నిస్తే.. ప్రజల మధ్య తిరుగుతున్నాను కనుక వాళ్లతో మమేకమవుతున్నానని, సమస్యలు తెలుసుకుంటున్నానని జగన్ చెబుతున్నాడని, ఈ పద్ధతే ‘బెటర్’ అని అతను అంటున్నాడని, అతనికి మనమేమీ చెప్పలేమని విమర్శించారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళతారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అటువంటి ఆలోచనే లేదని, ఎందుకంటే, గతంలో ఓసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్నాం కనుక అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తు ఉండదని, ఆ పార్టీతో పొత్తు ఉండదనే విషయాన్ని ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పిన విషయాన్ని కేఈ గుర్తుచేశారు.

More Telugu News