India: జాకెట్లలో బంగారం దాచి, ఎంబ్రాయిడరీ కలరింగ్... అడ్డంగా బుక్కయ్యాడు!

  • ఆగని బంగారం అక్రమ రవాణా
  • అరకిలో బంగారాన్ని ముక్కలు చేసి తెచ్చిన అయూబ్
  • చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన అధికారులు

విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వారిని ఎంతమందిని విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేస్తున్నా, రవాణాకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటూనే వున్నారు స్మగ్లర్లు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో అయుబ్ ఖాన్ అనే వ్యక్తి, కువైట్ నుంచి ఓమన్ ఎయిర్ లైన్స్ విమానంలో రాగా, అతను బంగారం తెచ్చిన విధానాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు.

స్త్రీలు ధరించే జాకెట్ లో బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా, దాచి, దానిపై ఎంబ్రాయిడరీ చేయించి తీసుకొచ్చాడు. తొలుత తనిఖీల్లో అతన్ని బయటకు పంపిన అధికారులు, ఏదో అనుమానంతో మరోసారి తనిఖీలకు రావాలని పిలువగా, అయూబ్ వాదనకు దిగాడు. తనిఖీలకు వెళ్లేందుకు నిరాకరించిన ఆయన, తాను తనిఖీలు ముగించుకుని వచ్చానని వాదులాడాడు. అతన్ని మరోసారి సోదా చేయగా, జాకెట్లలో దాచిన బంగారం బయటపడింది.

 దాదాపు అర కిలో బంగారాన్ని 11 ముక్కలుగా చేసి జాకెట్లలో చొప్పించాడని, దీని విలువ రూ. 15 లక్షలు ఉంటుందని చెప్పిన అధికారులు అయుబ్ తో పాటు, అతనికి స్వాగతం పలికేందుకు వచ్చిన ముస్తఫానూ అరెస్ట్ చేశారు.

More Telugu News