Madhya Pradesh: నిన్ను చంపేస్తా.. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ ఎమ్మెల్యే పుత్రరత్నం హెచ్చరిక

  • ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే పుత్రరత్నం సంచలన పోస్టు
  • హట్టాలో అడుగుపెడితే కాల్చి చంపేస్తా
  • కుమారుడి బెదిరింపులకు ఎమ్మెల్యే షాక్

కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాను చంపేస్తానంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బెదిరించాడు. బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్ కుమారుడు ప్రిన్స్‌దీప్ లాల్‌చంద్ ఖటిక్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేస్తూ.. ఉపకాశి హట్టాలో సింధియా అడుగుపెడితే చంపేస్తానని హెచ్చరించాడు. ‘‘జ్యోతిరాదిత్య సింధియా.. ఝాన్సీ లక్ష్మీభాయిని చంపిన జివాజీరావు రక్తం నీ నరాల్లో ప్రవహిస్తోంది. నీవు కనుక హట్టాలో అడుగుపెడితే నిన్ను కాల్చి చంపేస్తా. అయితే నువ్వు చస్తావు.. లేదంటే నేను’’ అని తన ఫేస్‌బుక్ ఖాతాలో హెచ్చరించాడు.

ఈ నెల 5న సింధియా హట్టా జిల్లాలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. హట్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమాదేవి కుమారుడి ఫేస్‌బుక్ బెదిరింపులతో షాక్‌కు గురయ్యారు. సింధియా గౌరవనీయ వ్యక్తి అని, తన కుమారుడు అటువంటి హెచ్చరికలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆ పోస్టు తొలగించాల్సిందిగా ప్రిన్స్‌దీప్‌ను కోరినట్టు తెలిపారు.

ప్రిన్స్‌దీప్ బెదిరింపులపై సింధియా కూడా స్పందించారు. బీజేపీ నిజ స్వరూపం ఇదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను సర్వనాశనం చేయడమే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధ్యేయమని దుయ్యబట్టారు. ఇటువంటి బెదిరింపులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు.

More Telugu News