Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'త్వరలో వస్తున్నా'నంటున్న శ్రుతి 
  • 111 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'గీతగోవిందం' 
  • వెరైటీ టైటిల్ తో పూరీ జగన్నాథ్
  • యూరప్ లో 'ఎఫ్ 2' పాటల చిత్రీకరణ  

*  గత కొంత కాలంగా కథానాయిక శ్రుతి హాసన్ సినిమాలలో కనిపించని సంగతి విదితమే. డిమాండ్ వున్నప్పటికీ అమ్మడు సినిమాలు చేయడం లేదు. దీనిపై శ్రుతి తాజాగా స్పందించింది. 'కావాలనే సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఈ సమయంలో ఎంతో తెలుసుకున్నాను. నన్ను నేను అర్థం చేసుకునే అవకాశం కూడా కలిగింది. త్వరలోనే మళ్లీ కొత్త సినిమాలు ఒప్పుకుని, మీ మధ్యకు వస్తాను' అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.
*  విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' చిత్రం ఇటీవలి కాలంలో సూపర్ హిట్ గా నిలిచింది. కాగా, ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.111 కోట్ల గ్రాస్ ను, రూ.60.8 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం.
*  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 'పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్'పై 'వాస్కోడగామా' అనే టైటిల్ని రిజిస్టర్ చేశారు. ఈ టైటిల్ తన కుమారుడు ఆకాష్ హీరోగా రూపొందే చిత్రం కోసమని అంటున్నారు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం షూటింగ్ కోసం యూనిట్ యూరప్ లోని చెక్ రిపబ్లిక్ కు చేరుకుంది. అక్కడ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లపై రెండు పాటలను చిత్రీకరిస్తారు.

More Telugu News