Guntur District: గుంటూరులో మద్యం మత్తులో హెడ్ కానిస్టేబుల్ వీరంగం.. మహిళపై చెప్పుతో దాడి!

  • పై అధికారులకు తెలియకుండానే మహిళలను తీసుకొచ్చినకానిస్టేబుల్
  • విచారణకు ఆదేశించిన అధికారులు
  • కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ

గుంటూరులో పూటుగా మద్యం తాగిన ఓ హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. విచారణ పేరుతో కొందరు మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చి చెప్పుతో కొట్టాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన కొందరు మహిళలను ఆదివారం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు విచారణ కోసం స్టేషన్ కు తీసుకొచ్చాడు. రాత్రి పూటుగా మద్యం తాగి మళ్లీ స్టేషన్ కు చేరుకున్న అతను.. అక్కడున్న ఓ మహిళపై చెప్పుతో దాడిచేశాడు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు ఫొటో తీసి ఇంటర్నెట్ లో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. తన పై అధికారులకు తెలియకుండానే వెంకటేశ్వరరావు సదరు మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన సమయంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మద్యం మత్తులో ఉన్నాడనీ, విచారణ పూర్తయ్యాక అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

More Telugu News