MAA: డబ్బు కాజేశానని నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా: నటుడు శివాజీ రాజా

  • గత మూడు రోజులుగా వివాదం
  • డబ్బు కాజేశారని శివాజీ రాజా, శ్రీకాంత్ లపై ఆరోపణలు
  • ఖండించిన నటులు

మూరీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిధులను తాను కాజేసినట్టు వచ్చిన వార్తలపై అధ్యక్షుడు శివాజీరాజా స్పందించారు. కొంతమంది ఇండస్ట్రీలోనివారు 'మా' ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, వారే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. అసోసియేషన్ డబ్బుతో తాను ఒక్క టీ కూడా తాగలేదని ఆయన అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను తప్పు పట్టడమే వాళ్ల పనని అన్నారు.

కాగా, ఇటీవల అమెరికాలో 'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో దుమారం మొదలైంది. గడచిన మూడు రోజులుగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ లో పంచాయతీలు జరుగుతూ ఉండగా, నటుడు, 'మా' కార్యదర్శి నరేష్, ఆఫీసుకు తాళం వేయడంతో పరిస్థితి మరింతగా ముదిరింది. ఆపై అత్యవసర సమావేశం జరిపి, శివాజీ రాజా వివరణ తీసుకున్న తరువాత, వివాదం సద్దుమణిగిందన్న ప్రకటన వెలువడినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఇదే విషయమై స్పందించిన శ్రీకాంత్, ఒక్క రూపాయిని తాను వాడుకున్నట్టు నిరూపించినా, 'మా' కార్యాలయంలో అడుగు పెట్టబోనని, సభ్యత్వానికి శాశ్వతంగా రాజీనామా చేస్తానని అన్నారు.

More Telugu News