poision: విజయవాడలో పోలీస్ వేధింపులు.. డీజీపీకి సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్యాయత్నం!

  • 6 నెలల క్రితం భార్య ఆత్మహత్య
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • విచారణ పేరుతో వేధించడంపై మనస్తాపం

ఓ కేసు విషయంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన నాగరాజు భార్య నాగమణి 6 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆమె పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేది. నాగమణి ఆత్మహత్య నేపథ్యంలో కేసు నమోదుకావడంతో విచారణ కోసం నాగరాజు స్టేషన్ కు వెళ్లేవాడు. అయితే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న జె.నాగరాజు అనే కానిస్టేబుల్ ఈ కేసులో తీవ్రంగా వేధించడంతో బాధితుడు మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో నిన్న డీజీపీకి ఈ వేధింపులపై సూసైడ్ నోట్ రాసిన నాగరాజు.. పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

విచారణ పేరుతో తనను స్టేషన్ కు పిలిపించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారనీ, తన భార్య ఆత్మహత్య కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తూ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగరాజు పురుగుమందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ విషయమై పోలీస్ అధికారులు ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News