family: ‘12 వేళ్లున్న పిల్లాడిని బలి ఇస్తే డబ్బే డబ్బు’ అన్న తాంత్రికుడు.. బాబును చంపేందుకు వెంటపడుతున్న బంధువులు!

  • ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఘటన
  • బలి ఇవ్వాలని సలహా ఇచ్చిన తాంత్రికుడు
  • వణికిపోతున్న తల్లిదండ్రులు

మూఢనమ్మకాలు కొన్నికొన్ని సార్లు ప్రాణాంతకం అవుతాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కాళ్లు, చేతులకు చెరో 12 వేళ్లతో జన్మించిన పిల్లాడిని బలి ఇస్తే.. భారీగా సంపద లభిస్తుందని ఓ తాంత్రికుడు చెప్పడంతో అతడిని చంపేందుకు సొంత బంధువులే ప్రయత్నిస్తున్నారు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు 24 గంటలు కంటికి రెప్పలా అతడిని కాపాడుకుంటున్నారు.

యూపీలోని బారాబంకి ప్రాంతానికి చెందిన దంపతులు ఇప్పుడు గజగజా వణికిపోతున్నారు. తమ పిల్లాడిని బలి ఇస్తే సంపద సిద్ధిస్తుందని ఓ తాంత్రికుడు చెప్పడంతో బంధువులంతా పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు తిరుగుతున్నారని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తమ కుమారుడిని స్కూలుకు కూడా పంపడం లేదని వాపోయాడు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

ఈ విషయమై బారాబంకి సర్కిల్ ఆఫీసర్ ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని చెప్పారు. తాను పిల్లాడి చదువుకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తానని ఆయన తెలిపారు. బాధిత కుటుంబం పేదదనీ, తానిక్కడ ఉన్నంతవరకూ పిల్లాడిని ఆదుకుంటానని చెప్పారు. 

More Telugu News