Vizag: ప్రియురాలి పెళ్లి చెడగొట్టానన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య!

  • ఆదివారం నాడు యువతికి జరగాల్సిన వివాహం
  • వరుడి వద్దకు వెళ్లి ఆమెను ప్రేమించినట్టు చెప్పిన రమేష్
  • ఆమె మంచిదంటూ సూసైడ్ లేఖ 

తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహమైపోతోందన్న అక్కసుతో, పెళ్లిని చెడగొట్టిన ఓ యువకుడు, ఆపై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో కలకలం రేపింది. మృతుని జేబులో లభించిన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడించారు.

 చిన్నతనంలోనే తండ్రి మరణించగా, తల్లి, అన్న, ఇద్దరు అక్కలతో కలసి నివసిస్తున్న రమేష్ అనే యువకుడు, పెయింటింగ్ పనుల్లో ఉన్నాడు. రమేష్, ఓ యువతిని ప్రేమిస్తుండగా, ఆమెకు ఆదివారం నాడు రఘు అనే యువకుడితో వివాహం జరగాల్సివుంది. తన ప్రియురాలికి పెళ్లవుతుందన్న బాధలో ఉన్న రమేష్, రఘు వద్దకు వెళ్లి, తన ప్రేమ గురించి చెప్పాడు. దీంతో రఘు ఆ పెళ్లిని రద్దు చేసుకోగా, రమేష్ పై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు రమేష్ ను విచారించి, పూచీకత్తుపై ఇంటికి పంపగా, దువ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ అమ్మాయి చాలా మంచిదని, తప్పు తనదేనని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తనది వన్ సైడ్ లవ్ మాత్రమేనని, ఆమెను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో నిందలు వేశానని తెలిపాడు. రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ లేఖలో రమేష్ కోరాడు. కాగా, ఇతని ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News