Gujarath: క్షీణిస్తున్న హార్దిక్ పటేల్ ఆరోగ్యం... వీలునామా రాసి సంచలనం!

  • గత 10 రోజులుగా హార్దిక్ ఆమరణ దీక్ష
  • బ్యాంకు డబ్బులు తల్లిదండ్రులకు, ఆవుల షెడ్ కు
  • ఇతర డబ్బులో మరణించిన 14 మంది పటీదార్లకు వాటా

గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ చేయాలని, గత 10 రోజులుగా అహ్మదాబాద్ లో ఆమరణ దీక్ష చేస్తున్న యువనేత హార్దిక్‌ పటేల్‌ ఆరోగ్యం క్షీణిస్తున్న వేళ, ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను పంచుతూ హార్దిక్ వీలునామా రాశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 50 వేలలో తల్లిదండ్రులకు రూ. 20 వేలు, పంజ్రపోల్‌ గ్రామంలో ఆవుల షెడ్‌ నిర్మాణానికి రూ. 30 వేలు ఇవ్వాలని తెలిపారు.

తన జీవితగాథపై వస్తున్న పుస్తకం 'హూ టుక్‌ మై జాబ్‌' విక్రయాల ద్వారా వచ్చే రాయల్టీ, తనపై ఉన్న బీమా డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడు సంవత్సరాల క్రితం పటీదార్‌ ఉద్యమం జరిగిన వేళ అసువులు బాసిన 14 మందికీ సమానంగా పంచాలని ఆయన వీలునామాలో రాసినట్టు పటీదార్‌ సంఘం అధికార ప్రతినిధి మనోజ్‌ పనారా తెలిపారు. ఈ ఆమరణ దీక్షలో తాను మరణిస్తే, కళ్లను దానం చేయాలని చెప్పారు. హార్దిక్ పటేల్ వీలునామా ప్రకారం, అతని ఆస్తిలో తల్లిదండ్రులకు, చెల్లెలికి 15 శాతం చొప్పున, మిగతా 70 శాతం 14 మంది మరణించిన పటీదార్ల కుటుంబాలకు చెందుతుంది.

More Telugu News