New Delhi: బిడ్డ పుట్టడంతో అరిష్టం మొదలైందంటూ... ఏడు నెలల బిడ్డ గొంతు పిసికి బక్కెట్ లో పడేసిన తల్లి!

  • న్యూఢిల్లీలో ఘటన
  • ఇంట్లో కొందరికి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు
  • బిడ్డ నీటిలో పడిందంటూ నాటకం ఆడిన తల్లి
  • పోస్టుమార్టం రిపోర్టుతో అసలు నిజం వెలుగులోకి

తనకు బిడ్డ పుట్టినప్పటి నుంచి అరిష్టం మొదలైందని, ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్న అనుమానంతో ఏడు నెలల కన్నబిడ్డను గొంతు పిసికి చంపిందో కసాయి తల్లి. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఘటన పూర్వపరాల్లోకి వెళితే, తన భర్తతో కలసి నివసిస్తున్న అడిబా ఖాన్ (27)కు ఫిబ్రవరిలో పాప పుట్టింది. ఇటీవలి కాలంలో వారింట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు, కొందరు అనారోగ్యం బారిన పడ్డారు.

పాప పుట్టిన తరువాతే తమకీ పరిస్థితి వచ్చిందన్న భావనలో ఉన్న అడిబా ఖాన్, పాప గొంతు పిసికి చంపింది. ఆపై నీళ్లల్లో ఉన్న బక్కెట్ లో పడేసి, బయటకు తీసింది. ఏడుస్తూ వెళ్లి పాప నీళ్ల బక్కెట్ లో పడిపోయిందని నాటకం ప్రారంభించింది. దాన్ని నమ్మిన భర్త, పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బిడ్డ చనిపోయిందని వైద్యులు స్పష్టం చేశారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి, పోస్టుమార్టం చేయించగా, బిడ్డను గొంతు పిసికి చంపారని తేలింది. దీంతో పోలీసులు అడిబాను విచారించి నిజం కక్కించారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

More Telugu News