BC garjana: బీసీలపై బాబు దృష్టి .. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ!

  • టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ
  • బీసీలను ఆకట్టుకోవడంపై దృష్టి
  • 5న పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాలను చేరువ చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఇటీవల గుంటూరులో ముస్లింల కోసం నిర్వహించిన ‘నారా హమారా-టీడీపీ హమారా’ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ఈ సారి బీసీల కోసం ‘బీసీ గర్జన’ పేరుతో వచ్చే నెల భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన బాబు.. బీసీల సభతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో భారీ ఎత్తున ‘బీసీ గర్జన’ సభ నిర్వహించాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో ఎప్పుడు, ఎక్కడ సభ నిర్వహించాలన్న విషయమై నిర్ణయం తీసుకోవాలని బాబు తూర్పుగోదావరి జిల్లా నేతలను ఆదేశించారు. ఈసారి విద్యార్థులతో జ్ఞానభేరి సభను విజయవాడలో నిర్వహించేందుకు బాబు నిశ్చయించారు.

అలాగే గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు గిరిజన క్రాంతి పేరుతో విశాఖలో భారీ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 5న అమరావతిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.

More Telugu News