Tamilnadu: ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలనే కడతేర్చిన తల్లి!

  • భర్త ఉండగానే మరొకరితో సంబంధం
  • ప్రశ్నించడంతో చంపేయాలని నిర్ణయం
  • తమిళనాడులోని కుండ్రత్తూర్ లో దారుణం

బిడ్డకు జ్వరం వస్తే, నీరసంగా మారిపోతేనే తల్లి మనసు అల్లాడిపోతుంది. చివరికి పిల్లాడు లేచి ఆడుకునేవరకూ ఆ అమ్మ మనసు కుదుటపడదు. కానీ తమిళనాడులో ఓ తల్లి మాత్రం అత్యంత కర్కశంగా ప్రవర్తించింది. భర్త ఉంగానే పరాయి మగాడి మోజులో పడ్డ సదరు మహిళ.. కన్నబిడ్డలను చంపేందుకు విషమిచ్చింది. దీంతో పిల్లలిద్దరూ నురగలు కక్కుతూ ప్రాణాలు విడిచారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని పల్లావరం కుండ్రత్తూర్ కు చెందిన విజయ్(34), అభిరామి(28) దంపతులకు  అజయ్(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు. విజయ్ ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతంలో ఓ హోటల్ లో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో అభిరామికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో అతను ఇంటికి రాకపోకలు సాగించేవాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కలవారు చెప్పడంతో విజయ్ భార్యను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.

దీంతో సదరు మహిళ ప్రియుడితో కలసి ఉండేందుకు భర్త, ఇద్దరు పిల్లలను చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో తాను ఆలస్యంగా వస్తానని శుక్రవారం విజయ్ భార్యకు చెప్పాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలకు ఆ రోజు రాత్రి పాలలో విషం కలిపి ఇచ్చింది. అనంతరం ప్రియుడితో కలసి కోయంబేడు బస్టాండ్ కు వెళ్లి నాగర్ కోయిల్ బస్సు ఎక్కేసింది. రాత్రి ఇంటికివచ్చిన విజయ్ తలుపులు మూసిఉండటం, లైట్లు వెలుగుతూ ఉండటంతో రెండో తాళంతో ఇంటి లోపలకు వెళ్లాడు. అక్కడ నేలపై ఇద్దరు పిల్లలు నురగలు కక్కుతూ అచేతనంగా పడిఉండటంతో వెంటనే అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ పిల్లలను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సుందరాన్ని అరెస్ట్ చేసిన అధికారులు అభిరామి కోసం గాలిస్తున్నారు. తొలుత పిల్లలతో పాటు భర్త విజయ్ ను కూడా చంపేయాలని అభిరామి నిర్ణయించుకుందనీ, కానీ కుదరకపోవడంతో పిల్లలకు విషమిచ్చిందని సుందర్ విచారణలో తెలిపాడు.

More Telugu News