IKEA: బిర్యానీలో గొంగళి పురుగు... ఐకియా రెస్టారెంట్ కు జరిమానా!

  • నెల రోజుల క్రితం ప్రారంభమైన ఐకియా స్టోర్
  • రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి
  • పురుగు రావడంతో ఫిర్యాదు
  • రూ. 11,500 జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

దాదాపు నెల రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని మైండ్ స్పేస్ వద్ద ప్రారంభమైన ఐకియాలో నిర్వహిస్తున్న రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు రాగా, దాడులు చేసిన జీహెచ్ఎంసీ విభాగం, ఐకియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తేల్చి రూ. 11,500 జరిమానా విధించారు. ఐకియా స్టోర్ కు వచ్చిన అబీద్ మహ్మద్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన బిర్యానీలో పురుగును చూసి అవాక్కయ్యాడు.

దాన్ని వెంటనే కవర్ లో ఉంచి, ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడంతో, జీహెచ్ఎంసీ అధికారులకు అది చేరింది. వెంటనే ఆరోగ్య విభాగం, వెటర్నరీ అధికారులు దాడులు చేసి, బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాల నమూనాలు సేకరించి, వాటిని ల్యాబ్ కు పంపారు. ఇక్కడ వ్యర్థాల నిర్వహణలో కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని తేల్చారు. కాగా, బిర్యానీలో పురుగు రావడంపై అంతర్గత విచారణ చేపడతామని ఐకియా అధికారులు పేర్కొన్నారు. 

More Telugu News