Uttar Pradesh: రూ.1500 అప్పు తీర్చలేదని.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం!

  • ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న ఘటన
  • ఇద్దరు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్న బాధితురాలు
  • అప్పు తీర్చకపోవడంతో.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేసిన వైనం

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. రూ. 1500 అప్పు తీర్చలేదని 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మురుద్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ ఖర్చుల కోసం జాహిద్, మోహన్ పాల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద బాధితురాలు రూ. 1500 అప్పు తీసుకుంది. చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె, కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో, అప్పు తీర్చాలంటా బాధితురాలిపై జాహిద్, మోహన్ లు ఒత్తిడి తీసుకొచ్చారు. తనకు కొంచెం సమయం కావాలని ఆమె అడిగింది.

ఈ క్రమంలో ఆమె సైకిల్ పై వస్తుండగా జాహిద్, మోహన్ లతో పాటు మరో మైనర్ బాలుడు ఆమెను అడ్డుకున్నారు. అప్పు చెల్లించాలని అడగ్గా, డబ్బు లేదని ఆమె తెలిపింది. దీంతో, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి, అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో... వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఘజియాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడకపోయినప్పటికీ, నేరానికి సాయపడ్డాడని తెలిపారు. అందువల్ల అతన్ని జువైనల్ హోమ్ కు తరలించామని చెప్పారు. 

More Telugu News