Hyderabad: బర్త్ డే పేరుతో ముజ్రా పార్టీ.. మత్తు మందు ఇచ్చి మైనర్ యువతిపై అత్యాచారం!

  • హైదరాబాద్ లోని కాలాపత్తర్ లో దారుణం
  • పార్టీ ముసుగులో ముజ్రా డ్యాన్స్
  • పోలీసుల అదుపులో 9 మంది విద్యార్థులు

హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. పుట్టిన రోజు పార్టీ పేరుతో స్నేహితులను ఆహ్వానించిన నిందితుడు.. ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా డ్రింక్స్ లో మత్తు మందు ఇచ్చి ఓ మైనర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముజ్రా పార్టీపై పక్కా సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న హోటల్ పై దాడి చేశారు.

ప్రధాన నిందితుడు ఖుద్దూస్ కాలాపత్తర్ లోని మయూరీ లాడ్జీలో బర్త్ డే పార్టీ వేడుకలు అని చెప్పి స్నేహితులను ఆహ్వానించాడు. ముగ్గురు అమ్మాయిలు, ఆరుగురు యువకులు ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖుద్దూస్ ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీలో భాగంగా అమ్మాయిలకు ఇచ్చిన డ్రింక్స్ లో నిందితుడు మత్తు మందు కలిపాడు. దీంతో ఓ మైనర్ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెపై ఖుద్దూస్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ముజ్రా పార్టీపై పక్కా సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు.. అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తున్న ముగ్గురు యువతులను రక్షించారు. వీరితో రూహీ అనే మహిళ అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ముగ్గురు అమ్మాయిలు, ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విద్యార్థులేనని తెలిపారు. ఖుద్దూస్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే లాడ్జీని సీజ్ చేసిన పోలీసులు.. ఓనర్ జాఫర్ పహిల్వాన్ పై కేసు నమోదు చేశారు.

More Telugu News