manchu manoj: నందమూరి కుటుంబాన్ని అలా చూస్తే గుండె తరుక్కుపోతోంది!: మంచు మనోజ్

  • చివరిదాకా ఆ కుటుంబానికి తోడుంటా
  • హరికృష్ణ చివరి కోరికను మన్నించండి
  • కేరళ వరద బాధితులను ఆదుకోండి

నందమూరి హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగా జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఏడవడాన్ని చూస్తే గుండె తరుక్కుపోయిందని హీరో మంచు మనోజ్ అన్నాడు. నందమూరి కుటుంబానికి తాను చివరిదాకా తోడుంటానని వ్యాఖ్యానించాడు. నెల్లూరులోని ఓ అభిమాని పెళ్లికి వెళుతూ కారు బోల్తా కొట్టడంతో బుధవారం ఉదయం హరికృష్ణ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిన్న హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించింది.

ఈ సందర్భంగా జరిగిన అంతిమయాత్రలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కలసి మనోజ్ పాల్గొన్నారు. అంతకుముందు హరికృష్ణ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయొద్దని మీడియాను మనోజ్ కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ట్వీట్టర్ లో మనోజ్ స్పందిస్తూ.. ‘నందమూరి కుటుంబాన్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దేవుడు నిజంగానే కఠినాత్ముడు. హరికృష్ణ గారి మరణం నుంచి నందమూరి కుటుంబం కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా. ఆ కుటుంబానికి నేను చివరిదాకా తోడుంటాను. తన పుట్టిన రోజుకు అనవసర ఖర్చులు పెట్టకుండా కేరళ బాధితులను ఆదుకోవాలన్న హరికృష్ణ గారి కోరికను మనమందరం నెరవేరుద్దాం. కేరళ బాధితుల కోసం నా వంతుగా రూ.5 లక్షలు అందించాను. నందమూరి అభిమానులు, తెలుగు సినీ పరిశ్రమ కూడా తగినంత సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

More Telugu News