wife: భర్తపై హత్య కేసు.. ప్రియుడితో వివాహం!

  • కూతురిని హత్య చేశాడంటూ అల్లుడిపై కేసు పెట్టిన తండ్రి
  • ఢిల్లీకి వెళ్లి సైలెంట్ గా ప్రియుడితో సంసారం చేస్తున్న కూతురు
  • బాగోతాన్ని బట్టబయలు చేసిన పోలీసులు

హత్యకు గురైనట్టు భర్తపై తండ్రితో కేసు పెట్టించి... తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న ఓ వివాహిత బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ డివిజన్ లోని బారాబంకీ ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళకు 2016లో అదే ప్రాంతానికి చెందిన రాహుల్ తో వివాహం అయింది. తన కూతురు రూబీని రాహుల్, ఆయన తల్లిదండ్రులు కట్నం కోసం హతమార్చారని రూబీ తండ్రి హరిప్రసాద్ ఈ ఏడాది ప్రారంభంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరి ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు.

ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో రూబీని భర్త రాహుల్ హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు రూబీ శవం దొరకలేదు. దీంతో పోలీసులకు కొంచెం అనుమానం వచ్చింది. ఆమె ఫేస్ బుక్, ఫోన్ నంబర్ పై నిఘా వేశారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలో ఉంటున్నట్టు ఫేస్ బుక్, ఫోన్ ద్వారా పోలీసులకు అర్థమైంది. అక్కడకు వెళ్లిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. తన ప్రియుడైన రామును వివాహం చేసుకుని, కాపురం చేస్తోంది రూబీ. దీంతో, ఇద్దరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా హత్యకు గురైనట్టు చిత్రీకరించడంపై కేసు నమోదు చేశారు. రూబీ భర్త రాహుల్ పై పెట్టిన కేసును ఎత్తేశారు. 

More Telugu News