Khammam District: ప్రేమ వివాహం చేసుకుని ఇంత దారుణమా? ఎస్ఐపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు!

  • మణుగూరు ఎస్ఐగా ఉన్న జితేందర్
  • భార్యను, ఆమె తల్లిని దారుణంగా హింసించిన వైనం
  • వీడియోలు, ఫొటోలు చూసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు

తను పోలీసుగా ఉండి, ఓ న్యాయవాదిని ప్రేమ వివాహం చేసుకుని, మూడేళ్ల కాపురం తరువాత, మరో మహిళతో సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను దారుణంగా హింసించిన మణుగూరు ఎస్ఐ జితేందర్ పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. భార్య పర్వీన్ ను, ఆమె తల్లిని జితేందర్ కొడుతున్న వీడియోలు, రక్తం కారుతూ ఇంటి ముందు పడివున్న వారి చిత్రాలను చూసిన అధికారులు, అతనిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తాను పనిచేస్తున్న మణుగూరు పోలీసు స్టేషన్ లోనే జితేందర్ కు వ్యతిరేకంగా కేసు నమోదు కాగా, అతనిపై 498 (ఏ), 323 సెక్షన్ ల కింద కేసు నమోదైంది.

ప్రస్తుతం జితేందర్ ను విధుల నుంచి తప్పించామని, కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఎస్ఐకి అనుకూలంగా వాదించేందుకు తామెవరమూ సిద్ధంగా లేమని ఖమ్మం బార్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. చట్టాన్ని కాపాడే బాధ్యతల్లో ఉన్న వ్యక్తి, దాన్ని అతిక్రమించడాన్ని తీవ్రంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News